ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ కంటి సమస్యలతో బాధపడుతున్నారు. సరైన పోషకాహారం అందకపోవడం, టీవీలు, కంప్యూటర్లు, ట్యాబ్లు, ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం.. వంటి కారణాల వల్ల పిల్లలకు చిన్నప్పుడే దృష్టి లోపాలు వస్తున్నాయి. ఇక కొందరు పిల్లల్లో జన్యులోపం వల్ల, వంశ పారంపర్యంగా దృష్టి లోపాలు వస్తుంటాయి.అయితే పిల్లలకు చిన్నప్పుడే కళ్లద్దాలను వాడే స్థితి రాకుండా ఉండాలంటే అందుకు కొన్ని సూచనలను పాటించాల్సి ఉంటుంది.
చదువులతోపాటు పిల్లలకు ఆటలూ కూడా అవసరమే. స్పోర్ట్స్ వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దృష్టి సమస్యలు రాకుండా ఉంటాయి. కనుక పిల్లలను రోజూ కనీసం గంట సేపు అయినా ఆడుకోనివ్వాలి. రోజూ కొంత సేపు అయినా సరే వెలుతురు లేదా ఎండలో గడిపేలా చూడాలి. ఫోన్లు, కంప్యూటర్లను ఎక్కువగా ఉపయోగించకుండా చూడాలి.
పిల్లలకు రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను ఇవ్వాలి. వారికి దృష్టి లోపాలు చాలా వరకు పోషకాహార లోపాల వల్లనే వస్తాయి. కనుక అన్ని విటమిన్లు, మినరల్స్ కలిగిన ఆహారాలను వారికి రోజూ ఇవ్వాలి. ముఖ్యంగా దృష్టి లోపాలు రాకుండా ఉండేందుకు విటమిన్- ఎ ను అందించాల్సి ఉంటుంది. విటమిన్ -ఎ ఎక్కువగా యాపిల్స్, కోడిగుడ్లు, టమాటాలు, నట్స్ వంటి ఆహారాల్లో లభిస్తుంది. అలాగే పాలు కూడా తాగించవచ్చు. ఆకుకూరలు ఎక్కువగా తినేలా చేయాలి.
పిల్లలకి ఓ వస్తువుగానీ, అక్షరాలుగానీ చూపించి వాటిని గుర్తించమని, చదవమని చెప్పాలి. వారు ఎంత దూరంలో ఉంటే స్పష్టంగా చెప్పగలుగుతున్నారు అనేది గమనించాలి. దీంతో వారికి దృష్టి లోపం వస్తే ముందుగానే పసిగట్టేందుకు అవకాశం ఉంటుంది.
ఎక్కువగా కళ్లు నలపడం, కళ్లు ఎర్రగా మారడం, కండ్ల నుంచి తరచూ నీరుగారడం ఇలాంటివి ఏవైనా గమనించినట్టయితే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదిస్తే మంచిది.