గుంటూరులోని వికాస్ హాస్టల్ గ్రౌండ్ లో ఆదివారం సాయంత్రం జరిగిన జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. గ్రౌండ్ లో పేదలకు సంక్రాంతి కానుకలు, జనతా వస్త్రాలు పంపిణీ సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే పలువురు గాయపడ్డారు. ఒక మహిళ సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రవాస భారతీయుడు ఉయ్యూరు శ్రీనివాస్ నేతృత్వంలోని ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరై కార్యక్రమానికి కొందరికి కానుకలు అందించారు. చంద్రబాబు ప్రసంగించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అనంతరం భారీ సంఖ్యలో హాజరైన ప్రజలకు కానుకల పంపిణీ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది.
కాగా గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన పేదలకు కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయిన ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేదలకు కానుకలు ఇచ్చేందుకు ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో తాను పాల్గొన్నానని చంద్రబాబు చెప్పారు. కార్యక్రమం ముగిసి తాను వెళ్లిన అనంతరం జరిగిన ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరం అని చంద్రబాబు అన్నారు. పేదలకు ఆ స్వచ్ఛంద సంస్థ చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి అనే ఆలోచనతో తానూ కార్యక్రమానికి వెళ్లాను అని చంద్రబాబు అన్నారు. పేదల ఇళ్లలో జరిగిన ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని, ఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు టీడీపీ అధినేత ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. మరోవైపు ఉయ్యూరు ఫౌండేషన్ మృతుల కుటుంబాలకు భారీ సాయం ప్రకటించింది. ప్రాణాలు కోల్పోయిన ఒక్కొక్కరికి రూ.20 లక్షల సాయం అందించనున్నట్లు ఉయ్యూరు శ్రీనివాస్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE