రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం సహా పలు అంశాలపై తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకునేందుకు, అలిపిరి నడక మార్గం గుండా మల్లారెడ్డి తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం మొదలైందని అన్నారు. రాబోయే ఏపీ ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్ధులను నిలబెడుతామని, ప్రజల ఆదరణ వస్తుందని భావిస్తున్నామని మల్లారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకున్నానని, అందుకే కాలినడకన తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఏపి, తెలంగాణాలు రెండు ఒకేసారి విడిపోయాయని, ఏపీని కూడా తెలంగాణ లాగా అభివృద్ధి చేందాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఏపీకి చేందిన 30 శాతం ప్రజలు హైదరాబాదులోనే ఉన్నారని, తెలంగాణలో ఉండే ఏపీ ప్రజలు అంతా తెలంగాణ అభివృద్ధిని చూస్తూనే ఉన్నారన్నారు.
ఏపీలో ఇప్పటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, కేంద్రం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇచ్చి తొమ్మిది ఏళ్ళు గడుస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విభజన సందర్భంగా రకరకాల హామీ ఇచ్చిందని, స్పెషల్ స్టేటస్/ప్రత్యేక హోదా మాటను మరిచి పోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో వస్తే, విభజనలో ఇచ్చిన హామీలు కేసీఆర్ రాకతోనే పూర్తి అవుతుందన్నారు. కేవలం మూడేళ్ల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేశారని, కేంద్రం నిధులు ఇచ్చినా, ఇవ్వక పోయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే ధమ్ము, ధైర్యం కేవలం కేసీఆర్ కే ఉందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ వచ్చాక దేశంలో పలు రాష్ట్రాల ప్రజలంతా ఆలోచనలో పడ్డారని, సీఎం కేసీఆర్ కొద్ది మందితో టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై సంవత్సరాల్లో చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ గా మార్చి 2024 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పధకాలు దేశంలో కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ఏర్పడిందని, బీఆర్ఎస్ పార్టీకి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మంచి ఆధరణ వస్తొందని, త్వరలో వివిధ రాష్ట్రాల్లో బహిరంగ సభలు పెట్టేందుకు సీఎం కేసీఆర్ సిద్దం అవుతున్నారన్నారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE