ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండో రోజు కొనసాగుతోంది. అయితే శుక్రవారం సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక ప్రకటన చేశారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సోమవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి అసెంబ్లీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కాగా ఈ పదవికి అధికార వైఎస్సార్సీపీ నుంచి విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలుస్తోంది. వీరభద్రస్వామి శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.
ఇక సోమవారం శాసనసభలో డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకుంటామని స్పీకర్ ప్రకటించగా, అది ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కోలగట్ల డిప్యూటీ స్పీకర్గా ఎన్నికవడం లాంఛనమే కానుంది. కాగా గురువారం అసెంబ్లీ సమావేశాల మొదటిరోజున డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేయగా, స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించడం తెలిసిందే. ఇక రెండోరోజు సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు తదితర అంశాలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరుగనుంది. అలాగే శాసన మండలిలో ఏపీలో విద్యా రంగంలో అమలవుతున్న పలు సంస్కరణలపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY