ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 27, శుక్రవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధానిపై జీఎన్రావు కమిటీ ఇచ్చిన నివేదిక, అమరావతి కోసం భూములిచ్చిన రైతుల సమస్యలపై కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. జీఎన్రావు కమిటీ సమర్పించిన నివేదికపై కేబినెట్ చర్చించి తీసుకోబోయే నిర్ణయంపై రాజధాని రైతులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు మూడు రాజధానుల అంశంపై రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేపడుతున్న నిరసనలు వరుసగా పదో రోజు కొనసాగుతున్నాయి. ఈ కేబినెట్ సమావేశం సందర్భంగా రాజధాని రైతులు ఆందోళనలు చేపట్టే అవకాశముందని, పోలీసులు ముందస్తుగా భారీ స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన 29 గ్రామాల ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడుతుండడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపడుతున్నారు. తుళ్ళూరులో పోలీసులు భారీగా మోహరించారు, అంతేగాక ముందు జాగ్రత్తగా తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. బారికేడ్లు, ముళ్లకంచెలతో పలు జంక్షన్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు గ్రామాల్లో రైతుల నిరసన ఉద్రిక్తకు దారి తీస్తుంది. ఈ రోజు వెలగపూడిలో పోలీసులు, ఆందోళన కారుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో అటుగా ఒక కారు రావడంతో మహిళలు చుట్టుముట్టి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్న సీఐ, ఎస్సైకి గాయాలయ్యాయి. మరోవైపు ఉద్దండరాయునిపాలెంలోని రాజధానికి శంకుస్థాపన ప్రదేశంలో కూడా కొద్దిసేపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
[subscribe]