జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో డిసెంబర్ 30వ తేదీన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు డిసెంబర్ 26, గురువారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. 30వ తేదీ ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, అమరావతి గ్రామాల ప్రజలు-రైతుల ఆందోళన, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రత, జనసేన పార్టీ స్టాండ్, అలాగే పార్టీ పరంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, తదితర అంశాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. జనసేన పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ, పార్టీ వ్యూహాత్మక కమిటీ, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, రాయలసీమ కో-ఆర్డినేషన్ కమిటీ, ముఖ్యనేతలు సమావేశంలో పాల్గొననున్నారు.
[subscribe]