ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 2, సోమవారం నాడు గుంటూరు జనరల్ ఆస్పత్రిలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు, చికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లిస్తారు. రాష్ట్రంలో పేద రోగులకు ఊరట కలిగిస్తూ, కుటుంబంలో ఎవరైనా జబ్బుపడితే వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలనే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా ఈ తరహా ఈ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టారు. చికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి తగినట్టుగా రోజుకు 225 రూపాయలు లేదా నెలకు 5 వేల రూపాయలను ఈ పథకం కింద అందజేస్తారు. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. సోమవారం నాడు గుంటూరు ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగులు సీఎం వైఎస్ జగన్ చేతులు మీదుగా చెక్కులు అందుకున్నారు. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 4.5 లక్షల మంది లబ్ధిపొందునున్నారని, అలాగే సంవత్సరానికి రూ.300 కోట్ల వరకూ వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆసుపత్రిలో చెక్కుల పంపిణీ అనంతరం గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ఉద్దేశిస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. పాదయాత్ర సందర్భంగా మాట ఇచ్చానని, ఆమేరకు ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స చేయించుకున్న వారికీ విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున లేదా నెలకు గరిష్టంగా రూ.5వేలు చెల్లిస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో జనవరి 1 నుంచి రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని 2 వేల రోగాలకు విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంటామన్నారు. జనవరిలో పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి ఏప్రిల్ నుంచి ఒక్కో జిల్లాకు విస్తరిస్తామని తెలిపారు. అదే విధంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 130కి పైగా సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా ఆదేశాలు ఇచ్చామని ప్రకటించారు. డిసెంబర్ 15 నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 510 రకాల మందులను అందుబాటులోకి తెస్తామని, వచ్చే 3 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్ నెల నాటికి 1060 కొత్త 104, 108 వాహనాలను కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో వైద్య రంగానికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ ప్రజలకు వివరించారు.
[subscribe]