నవంబర్ 4న అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన కార్యాలయంలోనే అదే ప్రాంతానికి చెందిన రైతు సురేష్ చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో మంటల్లో చిక్కుకున్న తహసీల్దార్ విజయారెడ్డిని ఆమె కారు డ్రైవర్ గురునాథం, అటెండర్ చంద్రయ్య రక్షించే ప్రయత్నం చేస్తూ తీవ్ర గాయాలపాలయ్యారు. కారు డ్రైవర్ గురునాథం నవంబర్ 5న చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, డిసెంబర్ 2, సోమవారం నాడు అటెండర్ చంద్రయ్య కూడా మరణించారు. కంచన్బాగ్ అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో నెల రోజులనుంచి చికిత్స పొందుతున్న అటెండర్ చంద్రయ్య ఈ రోజు తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. గుండె పోటు రావడంతో అటెండర్ చంద్రయ్య మృతి చెందినట్లుగా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోస్టుమార్టం నిర్వహించదానికి చంద్రయ్య మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో పరిహారంపై ప్రభుత్వం నుండి భరోసా కోరుతూ చంద్రయ్య కుటుంబ సభ్యులు, రెవెన్యూ ఉద్యోగుల ఆసుపత్రి వద్ద ధర్నా చేస్తున్నారు.
[subscribe]