ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జన్మభూమి కమిటీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014లో జిల్లా, మున్సిపాలిటీ, మండల మరియు గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలను రద్దు చేస్తూ తాజాగా వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను ఎక్కువ శాతం ఈ జన్మభూమి కమిటీలే నిర్వర్తించేవి. అయితే ఈ కమిటీల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలే కీలక పాత్ర పోషిస్తూ, లబ్ధిదారుల విషయంలో వివక్ష చూపుతున్నారని వైసీపీ నాయకులు తీవ్రంగా ఆరోపణలు చేసేవారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఈ కొత్త వ్యవస్థతో పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పు వస్తుందని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఈక్రమంలోనే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలను పూర్తీ స్థాయిలో రద్దు చేసినట్టుగా తెలుస్తుంది.
[subscribe]