పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఇరాన్పై అమెరికా మరోసారి బాంబు దాడులతో విరుచుకుపడింది. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగానే ముప్పు పొంచి ఉన్న కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు అమెరికా రక్షణ విభాగం ప్రకటించింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ, తమ రక్షణ బలగాలను కాపాడుకునేందుకు మరియు ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగానే ఈ తాజా సైనిక చర్యకు దిగాల్సి వచ్చిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.
ఈ తాజా దాడుల్లో భాగంగా అమెరికా ప్రధానంగా దక్షిణ ఇరాన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంది. అక్కడ ఉన్న ఇరాన్ సైనిక క్షిపణి కేంద్రాలతో పాటు, సముద్రంలో సీమైన్స్ (Sea Mines) అమర్చే బోట్లను టార్గెట్ చేస్తూ యూఎస్ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ వివరాలను వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా అత్యంత సంయమనం పాటిస్తూనే, తమ సైనిక బలగాల భద్రతకు ఎలాంటి ఢోకా లేకుండా చర్యలు తీసుకుంటోందని సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో దౌత్యపరమైన చర్చలు, శాంతి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలోనే ఈ తాజా దాడులు చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా జరిపిన ఈ ముందస్తు వ్యూహాత్మక దాడుల వల్ల దక్షిణ ఇరాన్లోని సైనిక మౌలిక వసతులకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ సైన్యం ఎలాంటి ప్రతిచర్యలకు దిగుతుందో, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఎంతవరకు దారితీస్తాయో అనే ఆందోళనలు అంతర్జాతీయ సమాజంలో వ్యక్తమవుతున్నాయి.







































