జనవరి 20న అసెంబ్లీలో ఆమోదించిన వికేంద్రీకరణ బిల్లును, రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టగా రెండు రోజుల పాటు ఈ బిల్లు ఆమోదంపై క్షణక్షణం ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే శాసన మండలిలో జనవరి 22, బుధవారం నాడు సరికొత్త ఘట్టం చోటు చేసుకుంది. వాదోపవాదాలు, చర్చల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ప్రకటించారు. చైర్మన్ గా తనకున్న విచక్షణాధికారాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంతో మూడు నెలలపాటు ఈ బిల్లులు పెండింగ్లో ఉండే అవకాశముంది. మండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయంపై టీడీపీ ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేయగా, రాష్ట్ర మంత్రులు, వైసీపీ సభ్యులు తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా నిర్వహించిన శాసనమండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు బుధవారం నాడు శాసనమండలిలో జరిగిన పరిణామాలపై టీడీపీ సీనియర్ నాయకుడు, మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. ఒకసారి బిల్లు సెలెక్ట్ కమిటీకి బిల్లు వెళ్లాక రాష్ట్రప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వడం అసాధ్యమని తెలిపారు. అలాగే సెలెక్ట్ కమిటీ అన్ని ప్రాంతాల్లో పర్యటించి అందరి అభిప్రాయాలు తీసుకోటానికి సమయం పడుతుందని చెప్పారు. సెలెక్ట్ కమిటీ నిర్ణయం తీసుకోవడానికి కనీస సమయం 3నెలలని, అంతే తప్ప 3 నెలల్లోపే నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
[subscribe]