ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అర్హులైన పేదలందరికీ ఇళ్లు స్థలాలు పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఉగాది నాటికీ 25 లక్షల మంది పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం భూ సేకరణ చేస్తుంది. ఈ నేపథ్యంలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా పంపిణీ కోసం రాజధాని అమరావతి పరిధిలోని పలు గ్రామాల్లో సేకరించిన భూముల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అర్హులైన పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీ నిమిత్తం సేకరించిన భూముల వివరాలకు సంబంధించిన జీవోను విడుదల చేసింది.
అందుకోసం సీఆర్డీఏ పరిధిలోని తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాలలోని కొన్ని గ్రామాలతో పాటుగా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్లో కూడా భూములు సేకరించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం 54,307మంది లబ్ధిదారులకు 1251.5 ఎకరాలు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలియజేసింది. నౌలూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడంలో గ్రామాలలోని భూములను అర్హులకు పంపిణీ చేయనున్నారు.
[subscribe]