ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 48 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అనుమతి రద్దు అయింది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతుండడంతో 48 కాలేజీల అనుమతులు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అలాగే వివిధ యూనివర్సిటీల పరిధిలోని 61 డిగ్రీ కాలేజీల్లోని కొన్ని ప్రోగ్రామ్స్/కోర్సులు కూడా రద్దు చేసినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా యూనివర్సిటీలతో అఫ్లియేషన్ లేకుండా మరియు ఇతర నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 246 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు ఉన్నత విద్యామండలి షోకాజ్ నోటీసులు జారీచేసింది. విచారణ కోసం ఒక కమిటీని నియమించి, అవసరమైన పత్రాలతో కమిటీ ముందు హాజరుకావాలని ఆయా కాలేజీలను ఆదేశించింది. కొన్ని కాలేజీలు కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వగా, మరికొన్ని విచారణకు కూడా హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో కమిటీ నివేదిక ఆధారంగా 48 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అనుమతులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో నన్నయ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న 50 కాలేజీలకు నోటీసులు జారీ చేయబడగా, వీటిలో 7 కాలేజీల అనుమతి రద్దు చేయబడింది, అలాగే 17 కాలేజీలలో కొన్ని కోర్సులు రద్దు చేయబడ్డాయి. నాగార్జున యూనివర్సిటీ పరిధిలో 23 కాలేజీలకు నోటీసులు ఇవ్వగా, 7 కాలేజీల అనుమతులు రద్దు చేయబడ్డాయి మరియు 9 కాలేజీల నుండి ప్రోగ్రామ్స్ ఉపసంహరించబడ్డాయి. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 42 కాలేజీలకు నోటీసులు ఇవ్వగా, 12 కాలేజీల అనుమతులు రద్దు మరియు 3 కాలేజీల్లో కోర్సులు ఉపసంహరించబడ్డాయి. ఎస్వీయూ పరిధిలో 11, కృష్ణ యూనివర్సిటీ పరిధిలో 4, యోగివేమన పరిధిలో 6, రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఒక కాలేజీ అనుమతి రద్దు చేయబడింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ