ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజుల్లో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే మెజారిటీ స్థానాల్లో విజయం సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రులకు పిలుపునిచ్చారు టీడీపీ కీలక నేత, మంత్రి నారా లోకేష్. ఈ మేరకు అమరావతిలోని తమ నివాసంలో సహచర మంత్రులకు అల్పాహార విందు ఇచ్చిన సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరియు అసెంబ్లీ సమావేశాలపై నేతలకు ఆయన పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ప్రాధాన్యతను ఆయన వివరించారు. వైకాపా హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల పతనం గురించి ప్రజలకు వివరిస్తూనే, కూటమి ప్రభుత్వం చేపడుతున్న పునర్నిర్మాణ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇంటింటి ప్రచారాన్ని కేవలం ముగించడం కాకుండా ప్రతి కుటుంబంతో ఎక్కువ సమయం గడిపి, ప్రభుత్వం వల్ల వారికి అందుతున్న లబ్ధిని వివరిస్తూ ఒక భావోద్వేగ అనుబంధాన్ని ఏర్పరచుకోవాలని స్పష్టం చేశారు.
అలాగే సర్ (SIR) డ్రాఫ్ట్ నివేదిక విడుదలైన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు భద్రంగా ఉండేలా చూడాలని, ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులను కోరారు. దీనితో పాటు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన కీలక అంశాలు, వ్యూహాలపై కూడా మంత్రులకు పలు మార్గదర్శకాలు చేశారు.
రాబోయే ఎన్నికల్లో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ, కూటమి ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడమే లక్ష్యంగా నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.









































