కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయంలో ఈ-వీసా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే విదేశీ భక్తులకు తిరుమల యాత్ర మరింత సులభతరం కానుంది.
విదేశాల నుంచి నేరుగా తిరుపతికి వచ్చే అవకాశం.. శ్రీవారి దర్శనం మరింత సులువు
ఇప్పటివరకు విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా చెన్నై, బెంగళూరు లేదా హైదరాబాద్ విమానాశ్రయాలకు చేరుకోవాల్సి వచ్చేది. అక్కడే ఈ-వీసా ప్రక్రియను పూర్తి చేసుకున్న అనంతరం రోడ్డు లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా తిరుపతికి చేరుకుని శ్రీవారిని దర్శించుకునేవారు.
తాజా నిర్ణయంతో తిరుపతి విమానాశ్రయంలోనే ఈ-వీసా సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో భవిష్యత్తులో విదేశీ ప్రయాణికులు నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని అవసరమైన వీసా ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం ఏర్పడనుంది. ఇది తిరుమలలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ముందుగానే ఈ-వీసా పొందాలి
అయితే ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం పది రోజుల ముందుగానే ఆన్లైన్లో ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాల్సి ఉంటుంది. విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చే సేవలు ప్రయాణికులకు అవసరమైన ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నాయి.
త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు?
ప్రస్తుతం తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులో లేవు. అయినప్పటికీ ముందస్తు ఏర్పాట్లలో భాగంగా తిరుపతి విమానాశ్రయంలో ఈ-వీసా కౌంటర్ ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
త్వరలోనే తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే విదేశీ భక్తులు, ముఖ్యంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే ప్రవాస భారతీయులు, ఇతర అంతర్జాతీయ పర్యాటకులకు తిరుపతి మరింత సౌకర్యవంతమైన గమ్యస్థానంగా మారే అవకాశం ఉంది.








































