తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఇక ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పార్టీ ఆవిర్భవించిందని, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఆశయ సాధనకు ప్రతి తెలుగు పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించింది డబ్బు కోసం కాదని, కేవలం తెలుగుజాతి రుణం తీర్చుకోవడానికేనని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ అని, ఆయన సాధించిన విజయాలు తెలుగు చరిత్ర ఉన్నంత వరకు ఉంటాయని పేర్కొన్నారు.
ఇక ఎన్టీఆర్ జన్మించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శతజయంతి ఉత్సవాలు జరుపుకొంటున్నామని, ఈ ఉత్సవాలను పురస్కరించుకుని వంద సభలు ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. నేటి ఆవిర్భావ సభ మొదటిది కాగా.. వందో సభ (మహానాడు)ను మే నెలలో రాజమండ్రిలో నిర్వహించనున్నామని వెల్లడించారు. కాగా యుగపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా.. కేంద్రం వంద రూపాయల వెండి నాణేలను తెస్తోందని, ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీని అభినందిస్తున్నానని, అలాగే ఆయనకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. టీడీపీ అంటే అభివృద్ధి అని, నాడు ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కళాశాలలు మంజూరు చేశామని, రోడ్లు, విద్యుత్, టెలికమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులతో అభివృద్ధికి నాంది పలికామని వివరించారు.
ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే పుట్టిందని, ప్రపంచం లోని ప్రతి తెలుగువారి అభ్యున్నతికి టీడీపీ పాటుపడుతుందని పేర్కొన్నారు. నాడు టీడీపీ హయాంలో హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్టు, సెల్ఫోన్, గ్రీన్ఫీల్డ్, ఎయిర్పోర్టులు, ఓపెన్ స్కై పాలసీ విధానాలతో సరికొత్త చరిత్ర సృష్టించామని చెప్పారు. పార్టీకి తెలంగాణలోనూ పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని, ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం బాగా జరుగుతోందని అభినందించారు. ఇక తన హయాంలో ప్రారంభించిన హైటెక్ సిటీ, ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టులు, జీనోమ్ వ్యాలీ ఏర్పాటు తదితర అభివృద్ధి కార్యక్రమాలను తదనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్యతో పాటు ప్రస్తుత సీఎం కేసీఆర్ కొనసాగించినందుకు వారిని అభినందిస్తున్నానని చంద్రబాబు అన్నారు.
హైదరాబాద్ నిర్మాణం స్పూర్తితో రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం లభించిందని, తనపై విశ్వాసముంచిన ప్రజల ఋణం తీర్చుకునేందుకు రాజధానిగా అమరావతిని ప్రారంభించానని తెలిపారు. దీనికోసం 33 వేల ఎకరాలను 29 వేల మంది రైతులు ప్రపంచ చరిత్రలో, ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఒక్క లిటిగేషన్ లేకుండా, స్వచ్ఛందంగా ల్యాండ్పూలింగ్కు ఒక్క రూపాయి తీసుకోకుండా భూమి ఇచ్చారంటే.. అదీ తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం, విశ్వాసం అని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం రాజధాని అభివృద్ధిని పట్టించుకోకుండా, లేనిపోని ఆరోపణలు చేయడం ద్వారా ప్రజలలో అపోహలు సృష్టించారని, రాజధానికోసం భూములను త్యాగం చేసిన రైతులను ఇబ్బందులు పాల్జేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఏపీలో టీడీపీ రావాల్సిన ఆవశ్యకత ఉందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE