ఆంధ్రప్రదేశ్లో జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆదివారం ఆయన తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు అచ్చెన్నాయుడు, కన్నా లక్ష్మీనారాయణ, నిమ్మకాయల చిన రాజప్ప, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, వర్ల రామయ్య తదితరులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసిందని, ఓటర్లను అనేక విధాలుగా ప్రలోభాలకు గురి చేసిందని మండిపడ్డారు. అయితే వైసీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రజలు టీడీపీ వైపే ఉన్నారని, అందుకే తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారని పేర్కొన్నారు.
ఏపీలో ఈ ఏడాది ఏం జరగబోతోందో ఉగాది పంచాగాన్ని రెండ్రోజుల ముందే ప్రజలు చెప్పేశారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మొత్తం 108 నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగాయని, ఒక్కో నియోజకవర్గంలో ఐదు నుంచి పాతిక వేల మంది పట్టభద్ర ఎన్నికల్లో ఓట్లు వేశారని తెలిపిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు టీడీపీ పాలనను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ సందర్భంగా, అధికారులు పక్షపాతంగా వ్యవహరించారని, ఒకసారి లెక్కింపు మొత్తం పూర్తయి ఫలితం ప్రకటించిన తర్వాత రీకౌంటింగ్కు అవకాశమే లేదని స్పష్టం చేశారు. అయితే సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు గెలిచిన టీడీపీ అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా వేధించారని, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినా ఇక్కడి అధికారులు కొన్ని గంటల పాటు డిక్లరేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలని సూచించారు. పట్టభద్ర ఎన్నికల్లో మేం పీడీఎఫ్ తో అవగాహన కుదుర్చుకుని ద్వితీయ ప్రాధాన్య ఓట్లను పరస్పరం వేసుకున్నామని, ఇక ఈ ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలని చంద్రబాబు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE