కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో తొమ్మిది రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపించింది. కరోనా వ్యాప్తిని నివారించడానికి తగిన చర్యలను అమలు చేయడంలో భాగంగా మహారాష్ట్ర,కేరళ, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ లకు ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపించింది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందాలకు ఆరోగ్యశాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న అధికారి నాయకత్వం వహించనున్నారు. ఈ కేంద్ర బృందాలు కరోనా కేసుల పెరుగుదలకు కారణాలను గుర్తించడంతో పాటుగా, కేసులు మరింత పెరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో తగిన చర్యలను అమలు చేయనున్నాయి.
మరోవైపు రోజువారీ కరోనా కేసుల నమోదు పెరుగుదల, ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్య తగ్గడం వంటి అంశాలపై మహారాష్ట్ర,కేరళ, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, జమ్మూకాశ్మీర్ లకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖలు రాశారు. కరోనా వ్యాప్తిని నిర్ధారించడానికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను ఎక్కువ చేయాలని ఆ లేఖలో సూచించారు. కరోనా ప్రభావం ఎక్కువుగా ఉన్న జిల్లాల్లో ఆర్టీ-పీసీఆర్ మరియు రాపిడ్ యాంటిజెన్ పరీక్షలను వేర్వేరుగా నిర్వహించాలని, అయితే ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగటివ్ వచ్చినప్పటికీ మళ్ళీ ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరిగా చేయాలని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిపై నిఘా, కట్టడి కోసం అమలు చేసే చర్యల విషయంలో అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి బృందాలకు పూర్తిగా సహకరించి, స్థానిక పరిస్థితిని బృందాలకు వివరించాలని చెప్పారు. అలాగే పర్యటన తరువాత తిరిగి ఆయా బృందాలతో కరోనా పరిస్థితులపై సమీక్షించాలని 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ