కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ మహమ్మారి దృష్ట్యా భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులు ఎయిర్ సువిధ పోర్టల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి స్వీయ-డిక్లరేషన్ ఫారమ్ను నింపాలనే నిబంధనను గతంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా దేశంలో కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎయిర్ సువిధ పోర్టల్లో ఇకపై స్వీయ-డిక్లరేషన్ ఫారమ్లు నింపాల్సిన అవసరం లేదని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన నిలిపివేతపై నవంబర్ 21, సోమవారం నాడు కేంద్ర పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాల కోసం కోవిడ్-19 మార్గదర్శకాల సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ నిర్ణయం 2022, నవంబర్ 22, (00:01 గంటల ఐఎస్టీ) నుండి అమలులోకి వస్తున్నదని, అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉంటుందన్నారు. అయితే పరిస్థితులకు అనుగుణంగా అవసరమైతే, ఈ నిర్ణయం మళ్ళీ సమీక్షించబడుతుందని తెలిపారు.
“మార్చి 2020లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించి, ఆ తర్వాత విమాన ప్రయాణాలను తిరిగి ప్రారంభించినప్పటి నుండి విమాన ప్రయాణంలో ప్రయాణికులకు కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో విమాన కార్యకలాపాలు, భద్రత మరియు పరిశుభ్రత సజావుగా జరిగేలా చూసేందుకు ఆపరేటర్లు, ప్రయాణికులు మరియు ఇతర వాటాదారుల కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించి మహమ్మారి తీవ్రతను బట్టి ఈ మార్గదర్శకాలు కాలానుగుణంగా సవరించబడ్డాయి మరియు సడలించబడ్డాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) వంటి ఇతర నియంత్రణ సంస్థలు కూడా తమ సంబంధిత డొమైన్లోని వాటాదారుల కోసం మార్గదర్శకాలను జారీ చేశాయి” అని చెప్పారు
“పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 2022, మే 10న అంతర్జాతీయ కార్యకలాపాల కోసం కోవిడ్-19 మార్గదర్శకాలను చివరిగా సమీక్షించింది. ఈ క్రమంలో కోవిడ్-19 యొక్క నిరంతర క్షీణత మరియు ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కవరేజీలో గణనీయమైన పురోగతిని సాధించిన నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోవిడ్-19 మహమ్మారికి సంబంధించి ‘అంతర్జాతీయ రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను’ 2022, నవంబర్ 21న సవరించింది. ఈ నూతన మార్గదర్శకాల దృష్ట్యా, ఆన్లైన్ ఎయిర్ సువిధ పోర్టల్ స్టాండ్లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్ను సమర్పించడంపై ప్రస్తుత మార్గదర్శకాలు నిలిపివేయబడ్డాయి” అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE