ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలలో ఈ వైరస్ ప్రభావం మరింత ఎక్కువుగా వుంది. అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ లలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 2, గురువారం సాయంత్రం 8.30 గంటల నుంచి ఏప్రిల్ 3, శుక్రవారం సాయంత్రం 8.30 గంటల వరకు 24 గంటల సమయంలో అమెరికాలో 1500 మంది కరోనా వైరస్ వలన మరణించినట్టు తెలిపారు. అమెరికాలో ఒకే రోజు ఇంతమంది మరణించడం ఇదే తొలిసారి. ఇక అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 7604 కు చేరుకుంది. మరోవైపు కరోనా బాధితుల సంఖ్య 2,77,828 కు చేరుకుంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, దేశ ప్రజలు మరో నాలుగు వారాల పాటు ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. ప్రజలంతా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రజలంతా సాధారణమైన లేదా ఇళ్లల్లో తయారు చేసుకున్న మాస్కులు ధరించాలని, మెడికల్ మాస్కులు, ఎన్-95 మాస్కులు ధరించవద్దని ప్రజలకు సూచించారు. అత్యవసర విభాగాల్లో వైద్య సేవలు అందించే వైద్య సిబ్బందికి ఆ మాస్కులు ఉపయోగపడతాయని చెప్పారు.
[subscribe]