కామన్ వెల్త్ గేమ్స్-2022 లో భారత్ అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా భారత్ వెయిట్ లిఫ్టర్ల అనంతరం జూడో అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు సాధించారు. ఈ క్రమంలోనే నాలుగోరోజైన ఆగస్టు 1, సోమవారం నాడు భారత్ ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి. జూడో అథ్లెట్లు సుశీలా దేవి లిక్మాబం రజతం, విజయ్ కుమార్ యాదవ్ కాంస్యం పతకాలు కైవసం చేసుకోగా, వెయిట్ లిఫ్టర్ హర్జిందర్ కౌర్ కాంస్యం పతకం గెలుచుకుంది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 3 స్వర్ణ, 3 రజత, 3 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 9 మెడల్స్ చేరగా, 7 పతకాలు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలోనే సాధించడం విశేషం.
జూడో మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో ఎంతో పోరాడిన సుశీల దేవి, దక్షిణాఫ్రికా చెందిన మైకేలా వైట్బూయి చేతిలో ఓడింది. దీంతో సుశీల దేవి రజత పతకం సాధించింది. కాగా సుశీలకు ఇది 2వ కామన్ వెల్త్ పతకం, గతంలో 2014 ఎడిషన్ లో కూడా ఆమె రజత పతాకాన్ని సాధించింది. ఇక పురుషుల 60 కేజీల విభాగం యొక్క కాంస్య పతక పోరులో విజయ్ కుమార్ సైప్రస్కు చెందిన పెట్రోస్ క్రిస్టోడౌలిడెస్ ను ఓడించి పతాకాన్ని సొంతం చేసుకున్నాడు. అంతకుముందు విజయ్ కుమార్ స్కాట్లాండ్కు చెందిన డైలాన్ మున్రోను ఓడించి కాంస్య పతక పోరుకు చేరుకున్నాడు. కాంస్య పతక పోరులో పెట్రోస్ ను విజయ్ కుమార్ కేవలం 58 సెకండ్స్ లోనే ఓడించాడు. అలాగే మహిళల 71 కేజీల విభాగంలో హర్జిందర్ కౌర్ 212 కేజీలు (స్నాచ్లో 93 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 119 కేజీలు) ఎత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. మరోవైపు కామన్ వెల్త్ గేమ్స్-2022 లో సోమవారం పతకాలు సాధించిన సుశీలా దేవి లిక్మాబం, విజయ్ కుమార్ యాదవ్, హర్జిందర్ కౌర్ లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY