రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. డిసెంబర్ 4 మరియు 5 తేదీల్లో ఆమె రాష్ట్రంలో పర్యటించనున్నారు. కాగా రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక తన పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రంలో రూ. 2,013 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర, జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన 3 రహదారులను రాష్ట్రపతి ముర్ము వర్చువల్ గా ప్రారంభిస్తారు. అలాగే మరో జాతీయ రహదారి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. దీనిపై రాష్ట్రపతి భవన్ ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.
ఇక ఆదివారం ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు స్వాగతం పలుకుతారు. రాష్ట్రపతి గౌరవార్థం ఏపీ ప్రభుత్వం పోరంకిలోని మురళీ కన్వెన్షన్ సెంటర్లో పౌర సత్కార కార్యక్రమం నిర్వహించనుంది. అనంతరం గవర్నర్ ఆధ్వర్యంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖపట్నం బయల్దేరి అక్కడ పలు హైవే ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ముర్ము విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో జరిగే ‘నేవీ డే’ కార్యక్రమంలో పాల్గొని భారత నౌకాదళం యొక్క నేవల్ పరేడ్ను తిలకిస్తారు.
ఆ తరువాత తిరుపతికి వెళతారు. సోమవారం తెల్లవారుజామున తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం, గోశాలను సందర్శిస్తారు. అటుపిమ్మట శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లో పాల్గొంటారు. ఎన్హెచ్ 340లోని రాయచోటి-అంగళ్లు సెక్షన్, తిరుపతిలో నిర్మించిన నాలుగు లేన్ల రైల్వే ఓవర్బ్రిడ్జ్ మరియు ఇతర రహదారులను ఆమె ప్రారంభిస్తారు. అలాగే ముదిగుబ్బ-పుట్టపర్తి మధ్య రెండు లైన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం చివరిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఇక రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఏపీ రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ పర్యటనకు ఏర్పాట్లు చేస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE