ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సంజీవ్ అరోరా పంజాబ్ నుంచి తమ పార్టీ రాజ్యసభ సభ్యులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో రాఘవ్ చద్దా ‘ఆప్’ పార్టీలో కీలక నాయకుడిగా పనిచేస్తున్నారు. అశోక్ మిట్టల్ ‘లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ’ స్థాపకుడు. అలాగే లూథియానాకు చెందిన సంజీవ్ అరోరా అనే వ్యాపారవేత్త కృష్ణ ప్రాణ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఛారిటబుల్ ట్రస్ట్ను నడుపుతున్నారు. వీరు ముగ్గురూ పంజాబ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. ఈరోజు పార్లమెంట్ హౌస్లో రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు సమక్షంలో రాజ్యసభ సభ్యులుగా వీరు ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా.. ఈ ముగ్గురు కొత్త సభ్యులకు ‘ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్’ పుస్తకాన్ని చదవాలని వెంకయ్య నాయుడు సలహా ఇచ్చారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై రాజ్యసభలో ప్రజల సమస్యలపై తమ పార్టీ గళం వినిపిస్తామని పేర్కొన్నారు. ‘ఆప్‘ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తమపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎ.వి. మురళీధరన్, సెక్రటరీ జనరల్ పి.సి. మోడీ మరియు రాజ్యసభ సెక్రటేరియట్లోని ఇతర సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ