క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్-2022 అక్టోబర్ 16వ తేదీ నుండి నవంబర్ 13వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్లో పాల్గొనేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ జట్టు అక్టోబర్ 6, గురువారం తెల్లవారుజామున ముంబయి నుండి ఆస్ట్రేలియాకు బయలుదేరింది. ప్రస్తుతం 14 మంది సభ్యులతో కూడిన భారత్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు జట్టు మేనేజ్మెంట్తో సహా భారత్ జట్టు ఆటగాళ్లు గ్రూప్ ఫోటోగ్రాఫ్ కోసం పోజు ఇవ్వగా, ఈ ఫోటోను భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.
వెన్ను గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్ కు దూరమైన విషయం తెలిసిందే. బుమ్రా స్థానంలో మరో ఆటగాణ్ణి బీసీసీఐ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి 14 మంది ఆటగాళ్లు మాత్రమే ఆస్ట్రేలియాకు వెళ్తున్నారు. ఇక టీ20 ప్రపంచ కప్ కోసం స్టాండ్బై ఆటగాళ్లగా ప్రకటించబడ్డ మహమ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్ లు సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత వచ్చేవారం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.
భారత్ జట్టు ముందుగా ఆస్ట్రేలియాలోని పెర్త్ కు చేరుకుంటుంది మరియు అక్కడ వారం రోజుల పాటు క్యాంపులో ఉండనున్నారు. అనంతరం బ్రిస్బేన్కు చేరుకొని, అక్కడ వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ గేమ్లతో పాటుగా అక్టోబరు 17న ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 19న న్యూజిలాండ్ లతో జరిగే రెండు ఐసీసీ వార్మప్ మ్యాచ్ లు ఆడనుంది. ఇక ప్రపంచకప్ లో భాగంగా భారత్ జట్టు అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో మెల్బోర్న్ ఏంసీజీ స్టేడియంలో మొదటి మ్యాచ్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్ కు రెండు వారాల సమయమే ఉండడం, ప్రస్తుత జట్టులో సగానికిపైగా ఆటగాళ్లకు ఇంతకుముందు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం లేకపోవడంతో ప్రాక్టీస్ మరియు పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందుగానే ఆస్ట్రేలియాకు వెళ్లాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY