అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు సంబంధించి మెన్ మరియు ఉమెన్ క్రికెటర్ల విభాగాల్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) “ప్లేయర్ ఆఫ్ ది మంత్” అవార్డు అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సెప్టెంబర్, 2022 నెలకు గానూ ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును భారత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గెలుచుకుంది. సెప్టెంబర్ లో ఇంగ్లాండ్ లో జరిగిన వన్డే సిరీస్లో చిరస్మరణీయ ప్రదర్శనకు గానూ హర్మన్ప్రీత్ కౌర్ ఈ అవార్డుకు ఎంపికయింది.
ఓటింగ్ లో భారత్ మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధాన మరియు బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా నుంచి పోటీ ఎదుర్కుని, ముందంజలో నిలిచి ఆమె ఈ అవార్డు దక్కించుకున్నారు. ఈ సిరీస్లో హర్మన్ 103.27 స్ట్రైక్ రేట్తో 221 పరుగులు చేసింది. ఈ అవార్డ్ దక్కడంపై హర్మన్ స్పందిస్తూ, నామినేట్ కావడం చాలా గొప్ప విషయమని, అలాగే అవార్డు గెలుచుకోవడం అద్భుతమైన అనుభూతి అని చెప్పారు. “నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం పట్ల నేను ఎప్పుడూ ఎంతో గర్వపడుతాను మరియు ఇంగ్లాండ్ లో చారిత్రాత్మక వన్డే సిరీస్ విజయం సాధించడం నా కెరీర్లో నాకు మైలురాయిగా మిగిలిపోతుంది” అని హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొంది.
ఇక సెప్టెంబర్, 2022కు గానూ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును పాకిస్తాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం భారత్ స్పిన్నర్ అక్షర్ పటేల్ మరియు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ నుంచి రిజ్వాన్ గట్టి పోటీ ఎదుర్కున్నాడు. రిజ్వాన్ సెప్టెంబర్లో 10 టీ20 మ్యాచ్లు ఆడి, అందులో 7 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్లోని మొదటి ఐదు టీ20లలో, అతను 60కుపైగా పరుగులను నాలుగు సార్లు నమోదు చేసి, ముందుగా జట్టును 3-2 ఆధిక్యంలోకి వచ్చేలా కీలక పాత్ర పోషించాడు. సిరీస్ లో ఒక మ్యాచ్ తక్కువ ఆడినప్పటికీ, 63.20 సగటుతో 316 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా మహమ్మద్ రిజ్వాన్ సిరీస్ను ముగించాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY