తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి.. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పెద్దలు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినట్లుగా చెప్తున్న కాంట్రాక్టులపై ఆయన స్పందించారు. సోమవారం మంత్రి వామపక్ష పార్టీల నేతలతో కలిసి మునుగోడు నియోజకవర్గ పరిధిలోని కొరటికల్ గ్రామంలో నిర్వహించిన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి కేవలం తన రాజకీయ అవసరాల కోసమే ఉప ఎన్నికలు సృష్టించారని, నియోజకవర్గం అభివృద్ధి కోసం కాదని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డికి నిజంగా నియోజకవర్గం అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే.. ఆయనకు కేంద్రంలోని బీజేపీ కట్టబెట్టిన కాంట్రాక్టుల విలువ రూ. 18 వేల కోట్లు నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గాల అభివృద్ధికి ఇవ్వాలని మంత్రి సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నామని, ఆ రూ. 18 వేల కోట్లు మునుగోడుకు ఇస్తామంటే.. ఉప ఎన్నికల బరి నుంచి టీఆర్ఎస్ తప్పుకుంటుందని జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తామందరం సీఎం కేసీఆర్ను ఎలాగో ఒకలా ఒప్పిస్తామని కూడా తెలియజేశారు. ఇక బీజేపీ నేతలు హిందూ మతాన్ని ఉద్ధరిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటుంటారని, కానీ వారు మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు దండుకుంటారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 1,000 కోట్ల నిధులు కేటాయించి యాదాద్రిని అద్భుతంగా పునర్మిస్తున్నారని, ఈ పవిత్ర కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి సామాన్య ప్రజలు కూడా విరాళాలు అందించారని, అయితే బీజేపీ నేతలు ఎవరూ కనీసం రూ. 100 కూడా చందా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఇక మునుగోడులో టీఆర్ఎస్కు పోటీ కాంగ్రెస్ పార్టీతోనేనని మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY