సౌథాంప్టన్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్ 2021 ప్రారంభం కావాల్సి ఉంది. కాగా ముందుగా ఊహించినట్టుగానే డబ్ల్యుటీసీ ఫైనల్ ప్రారంభానికి వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు నుంచే సౌథాంప్టన్లో వర్షం కురుస్తుంది. స్టేడియంలో పిచ్ ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. టాస్ సమయానికి వర్షం మరింత ఎక్కువడంతో పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు తొలి సెషన్ వరకు ఆటను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందిస్తూ దురదృష్టవశాత్తు వర్షం కారణంగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తోలి రోజున తోలి సెషన్లో ఆట ఉండదని ట్వీట్ చేసింది. రెండో సెషన్ సహా మొత్తం తొలిరోజు ఆటపై వర్షం ప్రభావం ఉండనున్నట్టు తెలుస్తుంది. క్రికెట్ చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు వర్షం అడ్డంకిగా నిలవడం పట్ల క్రీడాభిమానులు నిరాశకు గురయ్యారు.
మరోవైపు ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో తలపడే 11 మంది ఆటగాళ్లతో కూడిన భారత్ తుది జట్టును బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆరుగురు బ్యాట్స్ మెన్, బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ వంటి పాస్ట్ బౌలర్లతో భారత్ జట్టు రంగంలోకి దిగుతుంది.
భారత్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చటేశ్వర్ పుజారా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ