‘సాయిబాబా జన్మభూమి’పై తాజాగా వివాదం నెలకొన్న నేపథ్యంలో జనవరి 19, ఆదివారం నుంచి షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. షిర్డీలో సాయిబాబా ఆలయాన్ని మూసివేయడం లేదని, ఆలయంలో భక్తుల దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ స్పష్టం చేసింది. సాయిబాబా ఆలయాన్ని ఆదివారం నుంచి నిరవధికంగా మూసివేస్తునట్టు వచ్చిన వార్తలను సంస్థాన్ ట్రస్ట్ కొట్టిపారేసింది. ఆలయాన్ని తెరిచే ఉంచుతామని, రూముల సౌకర్యం, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలన్నీ ఎప్పటిలాగానే కొనసాగుతాయని చెప్పారు. షిర్డీలో బంద్ కేవలం గ్రామానికే పరిమితమవుతుందని చెప్పారు. మరోవైపు ఈ రోజు సాయంత్రం గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ వివాదంపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం.
పర్భిణి జిల్లాలోని ‘పాథ్రీ’ ని కొందరు సాయిబాబా జన్మస్థలంగా భావిస్తూ 1999లో సాయి జన్మస్తాన్ మందిరాన్ని నిర్మించారు. అక్కడ రోజురోజుకి భక్తుల తాకిడి పెరుగుతుండడంతో ‘పాథ్రీ’ పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్థాకరే రూ.100కోట్లు కేటాయించడంతో కొత్తగా సాయిబాబా జన్మభూమి వివాదం తెరపైకి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో షిర్డీలో గ్రామస్తులు ఆందోళన చేస్తూ బంద్ నిర్వహిస్తున్నారు. షిర్డీ సాయి జన్మస్థలం విషయంపై వివాదం చెలరేగడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో రాజకీయ జోక్యం తగదని గ్రామస్తులు విమర్శలు చేస్తున్నారు.