మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం చెలరేగిన నేపథ్యంలో శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఒక పరిష్కార మార్గం సూచించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద ప్రాంతాలను ‘కేంద్రపాలిత ప్రాంతం’గా ప్రకటించాలని ఉద్ధవ్ ఠాక్రే కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం మహారాష్ట్ర విధాన మండలిలో దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ఒకప్పటి మహారాష్ట్ర లోని భూభాగం మాత్రమే తాము కోరుతున్నామని, కర్ణాటకలోని ఒక్క అంగుళం భూమి కూడా తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునే వరకూ, కర్ణాటకలో కలుపుకున్న మహారాష్ట్ర ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని, ఈ తీర్మానాన్ని ఈరోజే సభ ఆమోదించి కేంద్రానికి పంపాలని ఆయన కోరారు.
ఇక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ సమస్య గురించి ఇప్పటివరకూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ అంశంపై తమ విధానాన్ని బలంగా చెప్తున్నారని, కానీ మహారాష్ట్ర సీఎం షిండే మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం భాష మరియు సరిహద్దుకు సంబంధించినది కాదని, మానవత్వానికి సంబంధించినదని ఠాక్రే పేర్కొన్నారు. మరాఠీ మాట్లాడే ప్రజలు తరతరాలుగా సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్నారని తెలిపిన ఠాక్రే, ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ వివాదాస్పద ప్రాంతాలైన బెళగావి, కార్వార్, నిప్పని ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE