ఐదు రోజుల శీతాకాల విడిది కోసం తెలంగాణ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం సాయంత్రం హకీంపేట ఎయిర్బేస్కు చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ముర్మును శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం ద్రౌపది ముర్ము భారత సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా హాజరయ్యారు.
ఇక రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికిన వారిలో సీఎం కేసీఆర్ తో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సహా పలువురు ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. అనంతరం హకీంపేట్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్న ద్రౌపది ముర్ము నేటి నుంచి 5 రోజుల పాటు బస చేయనున్నారు. కాగా ఈరోజు రాత్రికి రాజ్భవన్లో జరిగే విందు కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరవుతారని సమాచారం. ఇక రాష్ట్రపతి పర్యటన సందర్భంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE