ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించాలని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా భారత్ లో అక్టోబర్, నవంబర్ మధ్య జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్-2021 నిర్వహణను కూడా యూఏఈకి మార్చే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. దేశంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా, దేశంలో షెడ్యూల్ చేసిన టీ20 ప్రపంచ కప్ను యూఏఈకి మార్చవచ్చని, పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు. ఆటగాళ్ల ఆరోగ్యం మరియు భద్రత చాలా ముఖ్యమైన అంశాలని, దీనిపై త్వరలో తుదినిర్ణయం తీసుకొనునట్టు జై షా పేర్కొన్నారు.
యూఏఈలో సెప్టెంబర్ 18 మరియు అక్టోబర్ 10 మధ్య ఐపీఎల్-2021 లో మిగిలిన మ్యాచులను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. అనంతరం అక్కడే అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచ కప్-2021 ప్రారంభించి, నవంబర్ 14న ఫైనల్ నిర్వహించనున్నట్టు సమాచారం. కాగా టీ20 ప్రపంచ కప్ ను యూఏఈకి మార్చడంపై ఐసీసీతో సంప్రదింపులు, షెడ్యూల్, తుది నిర్ణయంపై బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ