భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే మూడు టీ20ల సిరీస్ లో బంగ్లాదేశ్ జట్టు శుభారంభం చేసింది. నవంబర్ 3, ఆదివారం నాడు జరిగిన మొదటి టీ20లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు, కీలక బ్యాట్స్ మెన్ తడబడడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం సౌమ్య సర్కార్ 35 బంతుల్లో 39 పరుగులతో రాణించగా, ముష్ఫికర్ రహీమ్ 43 బంతుల్లో 60 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో బంగ్లాదేశ్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది.
బ్యాటింగ్ ప్రారంభించిన తోలి ఓవర్ లోనే భారత జట్టు రోహిత్ శర్మ(9) వికెట్ కోల్పోయింది. మరో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ఆచితూచి ఆడాడు. శిఖర్ ధావన్ 42 బంతులు ఎదుర్కోని 41 పరుగులు చేసాడు. ఈ టీ20 సీరీస్ కు కోహ్లి విశ్రాంతి తీసుకోవడంతో మూడో స్థానంలో వచ్చిన లోకేశ్ రాహుల్ కూడ 15 పరుగులకే వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యర్ 22, రిషభ్ పంత్ 27 పరుగులు చేసి అవుట్ అయ్యారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ రెండు భారీ సిక్సర్లు బాదడంతో భారత జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. బంగ్లా బౌలర్లు షఫీయుల్, అమీనుల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బంగ్లాదేశ్ జట్టు సైతం లిటన్ దాస్(7) వికెట్ ఆదిలోనే కోల్పోయింది. అయితే సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కోవడం, భారత జట్టు ఆటగాళ్లు అనవసర తప్పిదాలు చేయడంతో బంగ్లాదేశ్ సునాయసంగా విజయం సాధించింది. ఇక రెండో టీ20 నవంబర్ 7 గురువారం నాడు రాజ్కోట్లో జరుగనుంది.