భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ గా ఎమ్మెస్కే ప్రసాద్ పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ చైర్మన్ను మార్చ్ 4, బుధవారం నాడు ఎంపిక చేసింది. సెలక్షన్ కమిటీకి నూతన ఛైర్మన్గా సునీల్ జోషీని ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కర్ణాటకకు చెందిన ఆల్రౌండర్ సునీల్ జోషీ 1996 నుంచి 2000 మధ్యకాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 15 టెస్టులు, 69 వన్డేలు తో పాటుగా 160 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు కూడా ఆడాడు. అలాగే హైదరాబాద్ క్రికెట్ జట్టుకు, జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టుకు కోచ్గా వ్యవహరించారు. సునీల్ జోషీతో పాటు మాజీ పేస్ బౌలర్ హర్వీందర్సింగ్కు కూడా సెలక్షన్ ప్యానెల్లో అవకాశం కల్పించారు. ఎమ్మెస్కే ప్రసాద్ స్థానంలో సునీల్జోషి, సెలక్షన్ కమిటీ సభ్యుడు గగన్ ఖోడా స్థానంలో హర్వీందర్ ఎంపియ్యారు.
ముందుగా సెలక్షన్ కమిటీ సభ్యులను ఎంపిక చేసేందుకు మదన్ లాల్, రుద్ర ప్రతాప్ సింగ్ (ఆర్పీ సింగ్), ఎంఎస్ సులక్షణ నాయక్ లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)ని బీసీసీఐ నియమించింది. క్రికెట్ సలహా కమిటీ సెలక్షన్ కమిటీ సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించగా 44 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న సునీల్ జోషి, వెంకటేశ్ప్రసాద్, ఎల్ఎస్ శివరామకృష్ణన్, రాజేష్ చౌహాన్, హర్వీందర్ సింగ్, తదిరులుకు సీఏసీ ఇంటర్వ్యూలను నిర్వహించింది. అనంతరం సునీల్జోషి, హర్వీందర్ లను ఎంపిక చేసినట్టుగా ప్రకటించింది. అలాగే కొత్త సెలక్టర్ల పని తీరును ఒక సంవత్సరం తర్వాత సమీక్షించి, పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది. వీరితో పాటుగా మరో సంవత్సరం పదవీకాలం కలిగిఉన్న దేవాంగ్ గాంధీ, జతిన్ పరాంజపే, శరణ్ దీప్ సింగ్ సెలక్షన్ కమిటీసభ్యులుగా కొనసాగనున్నారు.