జనవరి 27, సోమవారం నాడు ముంబయిలో ఐపీఎల్ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)- 2020 నిర్వహణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ విలేకరులతో మాట్లాడారు. ఐపీఎల్ టోర్నీలో ఇంతకుముందు లాగానే రాత్రి 8 గంటలకే మ్యాచ్లు ప్రారంభమవుతాయని సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. కొన్ని నెలల నుంచి ఐపీఎల్ రాత్రి మ్యాచులను 7 గంటలకు మారుస్తారని ఊహాగానాలు వినిపించాయి. దీనిపై పాలక మండలిలో చర్చించిన అనంతరం సమయం మార్పులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే రెండు మ్యాచులు జరిగే రోజుల్ని తగ్గించామని, కేవలం ఐదు రోజుల్లో మాత్రమే సాయంత్రం 4 గంటలుకు , రాత్రి 8 గంటలుకు రెండు మ్యాచులు నిర్వహించనున్నామని తెలిపారు.
ఐపీఎల్-2020లో తొలిసారిగా కంకషన్ సబ్స్టిట్యూట్ను ప్రవేశ పెడుతున్నామని గంగూలీ తెలిపారు. ఇక ఈ టోర్నీలో నోబాల్ నిర్ణయాలను మూడో అంపైర్ తీసుకుంటారని ఆయన వెల్లడించారు. అలాగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే 24, ఆదివారం నాడు ముంబయిలో జరుగుతుందని అన్నారు. ఐపీఎల్-2020 ప్రారంభానికి మూడు రోజుల ముందు ఐపీఎల్ ఆల్ స్టార్స్ మ్యాచ్ నిర్వహిస్తున్నామని, మ్యాచ్ నిర్వహణకు వేదికను ఇంకా ఖరారు చేయలేదని చెప్పారు. సహాయ కార్యక్రమాల నిధుల సేకరణ కోసం జరిగే ఈ ఛారిటీ మ్యాచ్ యొక్క ప్రక్రియను సరైన వారికి అప్పగిస్తామని పేర్కొన్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టుతో మార్చి నెలలో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ కోసం, కొత్త సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేస్తుందని గంగూలీ ప్రకటించాడు.