తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు సాధించిన అధికార టిఆర్ఎస్ పార్టీ ఖాతాలో కరీంనగర్ కార్పోరేషన్ కూడా చేరింది. కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జనవరి 27, సోమవారం నాడు జరగగా మొత్తం 60 డివిజన్లలో టిఆర్ఎస్ పార్టీ 33 డివిజన్లను గెలుచుకుంది. 33 మంది అభ్యర్థుల గెలుపుతో మెజారిటీ సాధించడంతో కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను టిఆర్ఎస్ చేజిక్కించుకోనుంది. జనవరి 29న జరిగే తొలి నగర పాలక మండలి సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నిక జరగనుంది.
ఇక బీజేపీ 13 డివిజన్లు గెలుపొంది రెండో స్థానంలో నిలువగా, ఎంఐఎం ఆరు డివిజన్లు, ఆలిండియా ఫార్వర్డ్బ్లాక్ పార్టీ తరుపున పోటీ చేసిన టిఆర్ఎస్ రెబెల్స్ మూడు డివిజన్లు, స్వతంత్ర అభ్యర్థులు ఐదు స్థానాల్లో విజయం సాధించారు. గత ఎన్నికల్లో 14 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖాతా తెరవలేక పోయింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో 14 మున్సిపాలిటీలలో మున్సిపల్ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లుగా టిఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికయ్యారు. కరీంనగర్ కార్పోరేషన్ గెలుపుతో ఎన్నికలు జరిగిన 10 కార్పోరేషన్ స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది. అలాగే 120 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగగా 110 చోట్ల చైర్మన్ పదవులను టిఆర్ఎస్ పార్టీ చేజిక్కించుకుంది.
[subscribe]