ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల చివరిరోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. తీర్మానంపై సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ పక్రియ నిర్వహించగా, 133 మంది సభ్యులు రద్దుకు అనుకూలంగా ఉన్నారు. ఇక ఈ తీర్మానంపై తటస్థంగా, వ్యతిరేకంగా ఎవరూ లేకపోవడంతో మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందినట్టుగా సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. రద్దు తీర్మానం సభలో ఆమోదం పొందడంతో కేంద్ర ప్రభుత్వం ఆమోదానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.
శాసనమండలి రద్దు తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, శాసనమండలి కచ్చితంగా ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని చెప్పారు. మండలిరద్దు పై శాసనసభే నిర్ణయం తీసుకుంటుందని, అలాగే రాష్ట్ర కేబినెట్ నేరుగా శాసనసభకు జవాబుదారీతనంగా ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో 28 రాష్ట్రాల్లో కేవలం ఆరు చోట్ల మాత్రమే మండలి అమలులో ఉందన్నారు. తమిళనాడు, అసోం, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే మండలిని రద్దు చేశాయని అన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
[subscribe]