తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 24 రోజులుగా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో అక్టోబర్ 25, సోమవారం నాడు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం, కార్మిక సంఘాల తరపు వాదనలు విన్న హైకోర్టు, తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. బుధవారం వరకు వాయిదా వెయ్యాలని ప్రభుత్వం కోరినా, అందుకు హైకోర్టు అంగీకరించలేదు. ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సత్వరమే పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని హైకోర్టు అభిప్రాయపడింది.
చర్చలు జరిపే విషయంలో కార్మిక సంఘాలు అన్ని డిమాండ్లపై చర్చకు పట్టుబడుతున్నాయని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు వివరించింది. కార్మికుల 21 డిమాండ్లలో 16 డిమాండ్లు సంస్థపై ఆర్థికభారం పెంచుతాయని, మరో రెండు డిమాండ్లు అసలు పరిగణించే స్థాయిలో కూడ లేవని అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఆర్టీసీ కార్మికుల పెట్టిన 21 డిమాండ్లలో, నాలుగు డిమాండ్ల పరిష్కారానికి రూ. 46.2 కోట్లు అవసరమని నివేదికలో పేర్కొన్నారు. ఆర్టీసీకి ప్రస్తుతానికి 50 కోట్లు ఇస్తే సమస్య తాత్కాలికంగా సద్దుమణుగుతుందని హైకోర్టు ఆశాభవం వ్యక్తం చేయగా, ప్రభుత్వం అంత మొత్తం చెల్లించలేదని అదనపు అడ్వకేట్ జనరల్ సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించాలని కోరింది. ఏజీ వివరణ ఇస్తూ కార్మికుల తీరు సరిగ్గా లేదని, 50 కోట్లతో సమస్య పరిష్కారం కాదని తెలిపారు.
ముందుగా అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) వాదనలు వినిపిస్తూ, ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఇప్పటికే ఆర్టీసీకి రూ.175 కోట్ల నష్టం వచ్చిందని, ప్రస్తుతం ఆర్టీసీ వద్ద కేవలం రూ.10 కోట్లు మాత్రమే ఉన్నాయని కోర్టుకు తెలిపారు. జరుగుతున్నా ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని, ఇప్పటికే కార్మికుల వేతనాలు పెంచామని హైకోర్టుకు నివేదించారు. మరో వైపు కార్మికులు ఎదురుకుంటున్న సమస్యలకు సంస్థ నష్టాలు కారణం కాదని కార్మిక సంఘాలు కోర్టుకు తెలిపాయి. ఆర్టీసీకి జీహెఛ్ఎంసీ రూ.1400 కోట్లు ఇవ్వాలని, రీయంబర్స్ మెంట్ తో కలిపి రూ.4,967 కోట్లు బకాయిలు ఉన్నాయని కార్మిక సంఘాలు చెబుతున్న దాంట్లో నిజమేంటని హైకోర్టు ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. అన్ని అంశాలను పరిశీలించి రేపు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
[subscribe]