బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి సుజిత్ కథ విషాదాంతమైంది. సుజిత్ మృతి చెందినట్లుగా సోమవారం రాత్రి సమయంలో అధికారులు గుర్తించారు. బోరుబావి నుంచి దుర్గంధం రావడంతో, వైద్యులతో దృవీకరించుకుని సుజిత్ మృతి చెందాడని అధికారులు ప్రకటించారు. బోరుబావిలోంచి నుంచి తీసిన సుజిత్ మృతదేహాన్ని మనప్పరాయ్ ప్రభుత్వాసుపత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి వారి స్వస్థలమైన నాడుకట్టుపట్టికి అంబులెన్స్లో తరలించారు. ఎలాగైనా సురక్షితంగా బయటపడతాడని అనుకున్న తరుణంలో సుజిత్ మృతి చెందడంతో అందరూ కన్నీరు మున్నీరయ్యారు.
తమిళనాడు లోని తిరుచిరపల్లి జిల్లా నాడుకట్టుపట్టి గ్రామంలో అక్టోబర్ 25న సుజిత్ ఆడుకుంటూ అనుకోకుండా బోరుబావిలో పడ్డాడు. మొదట 35 అడుగుల వద్ద చిక్కుకున్న సుజిత్, సహాయక చర్యలు కొనసాగుతుండగా దురదృష్టవశాత్తూ కిందకు జారిపోయి 90 అడుగుల లోతులో పడిపోయాడు. బోరు బావిలో పడిన బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు తమిళనాడు ప్రభుత్వం అన్ని రకాలుగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. భారీ యంత్రాగాలతో పాటు, జర్మనీలో తయారు చేయబడ్డ అత్యాధునిక వ్యవస్థని తెప్పించి చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు అనేక మంది ప్రముఖులు, ప్రజలు సుజిత్ సురక్షితంగా బయటపడాలని ప్రార్ధించారు. మూడు రోజుల పాటు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యి, సుజిత్ కథ విషాదాంతమైంది.