ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినందుకు శ్రీశాంత్ తో పాటు అజిత్ చండీలా, అంకిత్ చవాన్ లపై 2013 లో బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేరళ క్రికెటర్ శ్రీశాంత్ కు భారీ ఊరట లభించింది. జీవితకాలం నిషేదానికి గురై శిక్ష అనుభవిస్తున్న ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ నిషేధాన్ని ఏడేళ్ళకూ కుదిస్తూ బీసీసీఐ అంబుడ్స్మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆరేళ్ళ నుంచి శిక్ష అనుభవిస్తున్న అతను తన కెరీర్ ముగింపు దశకు చేరుకోవడమే తన నిర్ణయానికి కారణమని జైన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో శ్రీశాంత్ నిషేధం వచ్చే ఏడాది ఆగస్టుతో ముగుస్తుంది.
శ్రీశాంత్ తన కెరీర్లో భారతజట్టు తరుపున 53 వన్డే , 10 టి-20, 27 టెస్టు మ్యాచులు ఆడాడు. 2007 టి-20, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినా భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నిషేధ కాలంలో శ్రీశాంత్ ఎటువంటి క్రికెట్ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, ప్రవర్తన బాగుండడంతోనే జీవితకాల నిషేధాన్ని రద్దు చేసినట్టు జైన్ పేర్కొన్నారు. బీసీసీఐ అంబుడ్స్మన్ నిర్ణయం పట్ల శ్రీశాంత్ ఆనందాన్ని వ్యక్తం చేసాడు. నిషేధం ముగిసాక కేరళ తరుపున రంజీ క్రికెట్ ఆడతానని, వచ్చే నెల నుంచి సాధన మొదలు పెడతానని చెప్పాడు.