కరేబియన్ పర్యటనలో ఉన్న భారతజట్టు ఇప్పటికే టి-20, వన్డే సిరీస్ లు గెలిచి జోరుమీదుంది. ఇక టెస్టుల్లో కూడ సత్తా చాటాలని జట్టు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ లో భాగంగా ఈ రోజు భారతజట్టు వెస్టిండీస్ తో తొలిటెస్ట్ ఆడనుంది. దాదాపు ఎనిమిది నెలల విరామం తరువాత భారతజట్టు టెస్ట్ క్రికెట్ ఆడబోతుంది. రెండు టెస్టు మ్యాచుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్టు భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. ఇప్పటికే వన్డే, టి-20 సిరీస్లు కోల్పోయిన వెస్టిండీస్ జట్టు టెస్టుల్లో అయినా తమ ప్రదర్శనతో ఆకట్టుకోవాలని చూస్తున్నారు.
ఇప్పటి వరకు రెండు జట్లమధ్య జరిగిన 23 టెస్ట్ సిరీస్ లలో భారతజట్టు 9 సార్లు, వెస్టిండీస్ జట్టు 12 సార్లు సిరీస్ కైవసం చేసుకున్నాయి. అయితే ఈ పార్మాట్లో 2002 నుంచి వెస్టిండీస్ పై భారతజట్టు ఆధిపత్యం కనపరుస్తుంది. గత 17 సంవత్సరాలుగా వెస్టిండీస్ పై భారత్ ఒక్క టెస్టు సిరీస్ కూడ ఓడిపోలేదు. తుదిజట్టులో రోహిత్, అజింక్య రహానే లలో ఎవరికీ చోటు దక్కుతుందనే అంశంపై చర్చ జరుగుతుంది. ప్రపంచకప్ లో పరుగుల వరద పారించిన రోహిత్ శర్మకు ఇకనుంచి టెస్టులలో పూర్తిస్థాయిలో అవకాశం ఇవ్వాలని మాజీ క్రీడాకారులు కోరుతున్నారు. మరోవైపు ఈ సంవత్సరంలో ఇంగ్లాండును 2-1 తో ఓడించి స్వదేశంలో వెస్టిండీస్ ఆటగాళ్లు ఎంత ప్రమాదకరమో చాటి చెప్పారు. బ్రాత్వైట్, హోప్, హెట్మయిర్, బౌలర్ రోచ్, కెప్టెన్ హోల్డర్ తో బలంగా ఉన్నజట్టులోకి కొత్తగా రకీమ్ కార్నివాల్ ఈ సిరీస్ ద్వారా అరంగేట్రం చేయనున్నాడు.