మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ జి.నగేష్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. ఓ రైతు నుంచి 1.12 కోట్లు లంచం డిమాండ్ చేసిన కేసులో ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహించిన అనంతరం నగేష్ ను అరెస్ట్ చేశారు. నగేష్ తో పాటుగా మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీవో అరుణ, తహశీల్దార్ అబ్దుల్ సత్తార్, నగేశ్ బినామీ జీవన్గౌడ్, జూనియర్ అసిస్టెంట్ వసీం మహమ్మద్ ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
నర్సాపూర్ మండలం చిప్పలతుర్తిలో 112 ఎకరాల పట్టా భూమికి సంబంధించి ఎన్వోసీ ఇవ్వాలని ఓ రైతు అడిషనల్ కలెక్టర్ నగేష్ ను ఇటీవలే సంప్రదించారు. ఈ క్రమంలో ఒక్కో ఎకరానికి లక్ష చొప్పున 1.12 కోట్లు లంచం డిమాండ్ చేసిన నగేష్, ఇప్పటికే 40 లక్షలు తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. మిగతా 72 లక్షల రూపాయల కోసం తన బినామీ జీవన్గౌడ్ పేరుమీద కొంత భూమిని నగేష్ అగ్రిమెంట్ చేయించుకున్నారు. దీంతో ఆ రైతు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది. ఉదయం నుంచి ఈ కేసులో మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించారు. అరెస్ట్ చేసిన వారందరిని వైద్య పరీక్షల నిర్వహించాక హైదరాబాద్ కు తరలించి, కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu