తెలంగాణలో గడచిన వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. మరికొన్ని జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ అందరికీ నిన్నటినుంచి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో ప్రాజెక్టు కట్టలపైనుంచి వరద నీరు ప్రవహించింది. ఇన్ ఫ్లోకు తగినగట్లుగా ఔట్ ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టుకు ఎప్పుడు ఏమవుతుందోనని అధికారులతో పాటు ప్రజలు కూడా ఆందోళన చెందారు. అయితే ప్రాజెక్ట్ ప్రమాదం నుంచి బయటపడిందని, ప్రమాదకర స్థాయికి చేరిన ప్రాజెక్ట్ లోకి వరద ఉధృతి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు.
కడెం ప్రాజెక్ట్ పరిధిలోని లెఫ్ట్ కెనాల్కు గండి పడటం వలన కూడా ప్రాజెక్టుకు భారీ ముప్పు తొలగిందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 692 అడుగులకు చేరిందని మంత్రి వెల్లడించారు. ఇంద్రకరణ్ రెడ్డి ప్రాజెక్టు వద్దనే ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని, ప్రాజెక్టును కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు లోని మొత్తం 17 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నామని, ప్రస్తుతం ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే మొత్తంలో వరద దిగువకు విడుదల చేస్తున్నామని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ