తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొత్త రెవెన్యూ బిల్లు, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ చట్టంలోని అంశాలపై సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. అందులో భాగంగా విద్యార్థులకు కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్స్ జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఇకపై కుల ధ్రువీకరణ సర్టిఫికెట్స్ జారీచేసే అధికారం గ్రామపంచాయితీలకు, మునిసిపాలిటీలకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఇకనుంచి ఒకేసారిగా లైఫ్ టైమ్ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ అందజేస్తామని, విద్యార్థులు బయటి రాష్ట్రాలకు పోయినప్పుడు ఒకేవేళ అవసరమైతే వాళ్ళ పద్దతి, ఫార్మాట్ ప్రకారం కూడా అందజేస్తామని చెప్పారు. అదేవిధంగా ఆదాయ సర్టిఫికెట్ తెలంగాణ డేటాబేస్ ఆధారంగా మంజూరు చేస్తామని చెప్పారు. ఆదాయ సర్టిఫికెట్ జారీలో మానవప్రమేయం ఉండదని, డేటాబేస్ వివరాల ఆధారంగానే ఎలాంటి పక్షపాతం లేకుండా మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu