తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం నాడు ప్రగతి భవన్ లో వ్యవసాయ రంగం, విత్తనాల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం, రైతుబంధు పంపిణీ, ధాన్యం సేకరణ వంటి అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో ఆరునూరైనా వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింప చేసి, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనే సిద్దాంతంతో, వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఈ సమీక్ష సందర్భంగా రైతుబంధు పంపిణీపై నిర్ణయం తీసుకున్నారు. జూన్ 15 నుంచి 25వ తేదీ లోపల రైతుబంధు పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంబిస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటిదాకా ఇచ్చిన కేటగిరీల వారిగానే రైతు బంధు ఆర్ధిక సాయాన్ని ఖాతాలో వేయాలన్నారు. కాగా జూన్ 10 వ తేదీని కటాఫ్ డేట్ గా పెట్టుకోని ఆ తేదీవరకు పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ లోకి చేరిన భూములకు రైతు బంధు వర్తింప చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ఆర్ధిక సాయం వ్యవసాయాభివృద్దికి దోహద పడుతున్నదని సీఎం అన్నారు. ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతు ఖాతాలోనే జమవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పంటసాయం వల్ల రైతు శావుకారు దగ్గరికి అప్పుకు పోకుండా సకాలంలో వ్యవసాయం చేసుకుంటూ ఎరువులు విత్తనాలు కొని పంటకు పెట్టుబడి పెట్టి అధిక దిగుబడిని సాధించగలుగుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.
వానాకాలం సీజన్ ప్రారంభమౌతున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను ఫెస్టిసైడ్స్ ను అందుబాటులోకి తేవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కల్తీవిత్తనాలు, ఫెస్టిసైడ్స్, బయో ఫెస్టిసైడ్స్ పేరుతో మార్కెట్లోకి వస్తున్న కల్తీ ఉత్పత్తుల మీద ఉక్కుపాదం మోపాలని వ్యవసాయ శాఖ, పోలీసు, ఇంటెలిజెన్స్ శాఖలకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకనుంచి విత్తనాలు ఫెస్టిసైడ్లను అనుమతించిన కంపెనీల ద్వారా మాత్రమే విక్రయాలు జరిగేలా చూడాలని, ప్రభుత్వం జారీ చేసే క్యూ ఆర్ కోడ్ సీడ్ ట్రేసబిలిటీ విధానాన్ని అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని సీఎం ఆదేశించారు. విత్తనాలు ఫెస్టిసైడుల్లో కల్తీని అరికట్టడానికి కఠిన నిబంధనలను అమలు చేస్తూ, అవసరమైన చట్ట సవరణ చేయాలని, అందుకు సంబంధించి అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ