మరో పదిరోజుల్లో ఛత్రపతి శివాజీ స్వస్థలం శివనేరి నుంచే బీఆర్ఎస్ ఎన్నికల యాత్ర ప్రారంభిస్తామని ప్రకటించారు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్లో నిర్వహించిన తెలంగాణ ఆవల జరిగిన తొలి బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపనకు దారితీసిన పరిస్థితులు, ప్రస్తుత దేశ రాజకీయాలలో బీఆర్ఎస్ ఆవశ్యకత, పార్టీ ప్రాధాన్యత తదితర అంశాలపై మహారాష్ట్ర ప్రజలకు వివరించారు. ఇక సీఎం కేసీఆర్ అనర్గళంగా చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించడం విశేషం.
నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..
- మరాఠ్వాడ మహోన్నత వీరులు, సమాజ ఉద్దారకులులైన ఛత్రపతి శివాజీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, బావుసాట్, మహాత్మాజ్యోతిరావుపూలే, సావిత్రిబాయిపూలే వంటి కారణజన్ములు ఈ గడ్డపైనే జన్మించారు.
- అంతటి ఖ్యాతి కలిగిన ఈ గడ్డపై నివసిస్తున్న మహారాష్ట్ర ప్రజలకు నా అభివందనం.
- దేశానికి అన్నం పెడుతున్న అన్నదాత.. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడో అందరూ ఆలోచించాలి.
- వారిని ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆ పని చేయడం లేదు?
- ఇవన్నీ చూశాకే వారికోసం ఏమైనా చేయాలన్న తలంపుతోనే దేశంలోనే మొట్టమొదటిసారి నేను రైతుల నినాదాన్ని ఎత్తుకొన్నా.
- ‘అబ్ కీ బార్ .. కిసాన్ సర్కార్’ నినాదంతో కేంద్రంలో రైతు ప్రభుత్వం ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా.
- దేశంలోని రైతులు, రైతు కార్మికులు, వారి కుటుంబాలు కలిపితే జనాభాలో 50 శాతానికి పైగా ఉన్నారు.
- ధర్మం పేరుతో, కుల, మతాలు, రంగురంగుల జెండాల పేర్లతో విభజన చెందకుండా అన్నదాతలంతా ఏకతాటిపైకి వస్తేనే రైతు ప్రభుత్వ స్థాపన సాధ్యమవుతుంది.
- మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ సొంతూరు శివనేరి నుంచి బీఆర్ఎస్ ఎన్నికల యాత్రను పది రోజుల్లో ప్రారంభిస్తుంది.
- ఈసారి మనదేశంలో కిసాన్ సర్కార్ రావాలని శివాజీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేసి, యాత్రను ప్రారంభిస్తాం.
- ఛత్రపతి మహరాజ్ జన్మించిన స్థలం శివ్నేరీ సాక్షిగా మహారాష్ట్ర రైతుల తలరాతను మారుస్తానని శపథం చేస్తున్నా.
- మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి యాత్ర ప్రారంభం అవుతుంది.
- త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కిసాన్ కమిటీలు ఏర్పాటు చేస్తాం.
- ఈ సందర్భంగా ఉత్తర మహారాష్ట్ర, పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ ప్రాంతాల్లో పర్యటిస్తాను.
- రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు అవకాశం ఇవ్వాలి.
- ఆ ఎన్నికల్లో రైతులు తమ సత్తా చూపితే కచ్చితంగా మహారాష్ట్ర ప్రభుత్వం దిగివస్తుంది.
- దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణలోని ప్రతీ సంక్షేమ పథకం మహారాష్ట్రలో అమలు చేస్తాం.
- దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడిచినా.. ఇప్పటివరకూ ఏ రాష్ట్రంలోనైనా భారీ డ్యామ్ కట్టగలిగారా?
- మనకన్నా ఎంతో చిన్న దేశాలు అతిపెద్ద డ్యామ్లను నిర్మించగా లేనిది, మన దగ్గర నిర్మించలేకపోయారేందుకు?
- ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ను అతి చిన్న దేశమైన జింబాబ్వేలో 1959 లోనే నిర్మించారు.
- అలాగే యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, చైనా తదితర దేశాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్లు ఉన్నాయి.
- దేశంలోని అన్ని నదుల్లో కలిపి ప్రవహిస్తున్న 70 వేల టీఎంసీల నీటిలో 20 వేల టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాం.
- గోదావరి, కృష్ణా సహా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనన్ని నదులు మహారాష్ట్రలో ప్రవహిస్తున్నాయి.
- ప్రవర, పూర్ణ, పెన్గంగ, వెన్గంగ, వార్దా, పంచగంగ, ఘటప్రభ, మంజీర, భీమా, ప్రాణహిత, ఇంద్రావతి వంటి చిన్నచిన్న నదులు అనేకం ఉన్నాయి.
- అయినా రాష్ట్రంలో నీటి కష్టాలు ఉన్నాయంటే అందుకు కారణాలు ఏంటో? కారకులు ఎవరో? ప్రజలు ఆలోచన చేయాలి.
- 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో 15 మంది ప్రధానులు, ఎందరో సీఎంలు పాలించిన తర్వాత కూడా అనేక ప్రాంతాల్లో తాగడానికి, సాగు నీళ్లు ఎందుకు దొరకటంలేదు?
- నిరంతర విద్యుత్తు ఎందుకు సరఫరా చేయరు? వాళ్లకు ఇవ్వడం ఇష్టం లేదా? లేక వాళ్లకు చేతకాలేదా?
- దేశంలో స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 4,10,339 మెగావాట్లు ఉన్నా విద్యుత్తు కోతలు ఎందుకు ఉన్నాయి?
- దేశవ్యాప్తంగా 40,130 మెగావాట్లు సామర్థ్యం కలిగిన 34 థర్మల్ విద్యుత్తు ప్లాంట్లు మూలనపడ్డాయి.
- అలాగే దేశంలో 114 ఏళ్లకు సరిపోయే బొగ్గు నిల్వలున్నాయి, వాటితో 114 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు.
- నా శక్తి ఉన్నంత వరకు ఈ దేశం బాగు కోసం పోరాడుతా, రైతుల క్షేమం కోసం పాటుపడతా.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE