రాష్ట్రంలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న పలు పథకాల పురోగతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి మంగళవారం సమీక్షించారు. పల్లె ప్రగతి, జాతీయ ఉపాధి హామీ పథకం, గామీణ సడక్ యోజన, స్వయం సహాయక బృందాల పనితీరు తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ హనుమంత రావు, తదితర ఉన్నతాధికారులు హాజరైన ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, దేశంలోనే అన్ని గ్రామ పంచాయతీలను ఓడీఎఫ్ ప్లస్గా ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పల్లె ప్రగతి, హరిత హారం లాంటి రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక కార్యక్రమాల వల్లనే వంద శాతం గ్రామాలు ఓడీఎఫ్ గా మారాయని సీఎస్ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు గణనీయంగా పెరగడంతోపాటు గ్రామ పంచాయతీల పాలన మెరుగుపడిందన్నారు.
డెంగ్యూ కేసులు గణనీయంగా తగ్గడం, గ్రామ పారిశుధ్యం మెరుగుపడడంతో పాటు గ్రీన్ కవర్ గణనీయంగా పెరిగిందని శాంతి కుమారి పేర్కొన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు, ట్రాలీలు సమకూర్చడం జరిగిందని, గ్రామాల్లో డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉపాధి హామీ పథక పురోగతిని సమీక్షిస్తూ, రాష్ట్రంలో1.11 కోట్ల మందికి 52.78 లక్షల జాబ్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద వైకుంఠ ధామములు, డంపింగ్ యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డ్రైయింగ్ ప్లాట్ఫారమ్లు, సీసీ రోడ్లు మొదలైన వాటి నిర్మాణం పూర్తి చేసినట్టు సీఎస్ వెల్లడించారు. వాటర్షెడ్ కార్యక్రమం (ప్రధాన్ మంత్రి కిసాన్ సించాయి యోజన) కింద 200 అమృత్ సరోవర్లను నిర్మించినట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) ఫేజ్-11 కింద 42 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, 11,60,920 వ్యక్తిగత సోక్ పిట్లు, 32,650 సామాజిక సోక్ పిట్లను నిర్మించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఇంజనీర్-ఇన్-చీఫ్ సంజీవరావు, స్పెషల్ కమిషనర్, ఆర్డీవీఎస్వీఎన్ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE