తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఆరు గ్యారెంటీలు కీలక పాత్ర పోషించాయి. ఆరు గ్యారెంటీలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ఫలితంగా కాంగ్రెస్కు అధికారం చేజిక్కింది. దీంతో ఆ గ్యారెంటీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులేస్తోంది. 100 రోజుల్లో గ్యారెంటీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ఇక్కడే కాంగ్రెస్ సర్కార్కు పెద్ద సమస్యొచ్చి పడింది. ఆర్టిక కష్టాలు కొత్త సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుపడుతున్నాయి.
ఓవైపు లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో హవా చాటాలన్నా.. మెజార్టీ సీట్లను దక్కించుకోవాలన్నా.. ఎన్నికల లోగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరాల్సిందే. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎటమటంగా ఉంది. ఈ పరిస్థితుల మధ్య ఆరు గ్యారెంటీలను అమలు చేయడం కాంగ్రెస్ సర్కార్కు పెద్ద సవాల్గా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే రూ. 1,400 కోట్లు అప్పు చేసింది. ఇప్పుడు మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు కొత్త రుణాలు కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లక్ష్యం మేరకు రుణ సేకరణ దాదాపు నాలుగు నెలల ముందే పూర్తయింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ 38,234 కోట్ల మేర రుణాలు తీసుకోనున్నట్లు బడ్జెట్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకంటే ముందే గత సర్కార్ పూర్తిగా రుణ సదుపాయాన్ని వినియోగించుకుంది. దీంతో కాంగ్రెస్ సర్కార్కు చిక్కులు ఎదురవుతున్నాయి.
ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే పెద్ద ఎత్తున నిధులు కావాల్సి ఉంటుంది. ఈక్రమంలో వచ్చే మూడు నెలల్లో రిజర్వు బ్యాంక్ నుంచి రూ. 13 వేల కోట్లు అప్పుగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అప్పుకోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఎఫ్ఆర్బీఎం కింద రుణ పరిమితిని సడలించాలని కేంద్ర ఆర్థిక శాఖను కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి కేంద్రం నిర్ణయం రేవంత్ సర్కార్కు అనుకూలంగా ఉంటుందా..? లేదా..? అనేది చర్చనీయాంశంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ