తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం నాడు అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్వోలు, టీచింగ్ ఆసుపత్రి సూపరింటెండెంట్లు, యూపీహెచ్సీ, పీహెచ్సీల వైద్యాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల సన్నద్దత తదితర అంశాలపై సమీక్షించి అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన గర్భిణుల కోసం అన్ని ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, వార్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. వీరితో పాటు కరోనా సోకిన ఇతర బాధితులకు అత్యవసర సేవలు, శస్త్ర చికిత్సలు అందించేందుకు కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, వార్డు కేటాయించాలని ఆదేశించారు. అన్ని సౌకర్యాలు ఉండి కూడా, అనవసరంగా వారిని ఇతర ప్రభుత్వ పెద్దాస్పత్రులకు రిఫర్ చేయవద్దని, ఇదే విధంగా అత్యవసర సేవలు, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని కోవిడ్ సోకిందని చికిత్స అందించేందుకు నిరాకరించవద్దని, వారి కోసం కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, వార్డును ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వైద్యాధికారులు క్షేత్ర స్థాయి పర్యటన చేయాలని, పరిస్థితులను తెలుసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అన్ని ఆసుపత్రులకు అసవరమైన వైద్య పరికరాలను అందించడం జరిగిందని, అవి పూర్తి వినియోగంలో ఉండేలా చూడాలనిఆదేశించారు.
ఆదివారం కూడా కరోనా వాక్సినేషన్, టెస్టింగ్ :
కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టే వరకు బస్తీ దవాఖానాలు, పీహెచ్సీలు, సబ్ సెంటర్లు ఆదివారం కూడా పని చేయాలని అన్నారు. వ్యాక్సినేషన్, పరీక్షలు, హోమ్ ఐసొలేషన్ కిట్ల పంపిణీ జరగాలని, లక్షణాలతో ఎవరు వచ్చినా పరీక్ష చేసి, లక్షణాలు ఉంటే కిట్ ఇచ్చి పంపాలని చెప్పారు. కేంద్రం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రతీ పీహెచ్సీలో రాత్రి పదింటి వరకు వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పీహెచ్సీలో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. కరోనా వచ్చి సాధారణ లక్షణాలు ఉన్నవారికి కిట్లు ఇవ్వడంతో పాటు, వారి ఆరోగ్య పరిస్తితిని తెలుసుకుంటు ఉండాలని, అవసరమైతే వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని చెప్పారు.
వాక్సినేషన్ లో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండేలా చూడాలి:
“ఇక రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ వాక్సిన్ రెండు డోసులు ఇవ్వాలి, అందుకు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలి. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన మున్సిపల్ సిబ్బంది, పోలీసులు, ఇతర విభాగాలకు వంద శాతం బూస్టర్ డోస్ పూర్తి చేయాలి. డీఎంహెచ్వోలు కలెక్టర్లతో మాట్లాడి మున్సిపల్ సిబ్బంది అందరికీ, జిల్లా ఎస్పీలతో మాట్లాడి పోలీసులందరికీ వందకు వంద శాతం బూస్టర్ డోస్ వేసేలా సమన్వయంతో పని చేయాలి. రాష్ట్రంలోని ప్రతీ పీహెచ్సీ పరిధిలో రెండో డోస్ పెండింగ్ లో ఉండవద్దని, పీహెచ్సీ వైద్యులే బాధ్యత తీసుకుని రెండో డోస్ వందకు వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. వాక్సినేషన్ లో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండేలా చూడాలి. 15-18 ఏళ్ల వారికి వేసే వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేయాలి. సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా పిల్లలు అంతా గ్రామాల్లో ఇంటి వద్దే ఉంటారు, పీహెచ్సీ వైద్యులు ఇంటింటికి వెళ్లి 15 ఏళ్లు దాటిన పిల్లలందరి వాక్సిన్ ఇవ్వాలి. క్లిష్టమైన సమయంలోనే బాధ్యతతో ప్రజలకు సేవలందించాలి. ప్రజలకు ధైర్యం ఇవ్వాలి. వాక్సినేషన్ అందరికీ ఇవ్వడం ద్వారా రక్షణ కవచాన్ని మనమే ఏర్పాటు చేయాలి. కరోనా నుండి ప్రజలను రక్షించేందుకు అవసరమైన అన్నిటినీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమకుర్చుతున్నారు, 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు సమకూర్చుకోవడం జరిగింది. ప్రజలకు పూర్తి స్థాయిలో నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత మనపై ఉంది” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాస్ రావు కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ