శ్రీశైలం ప్రాజెక్టు, ఆనకట్ట భద్రత పై ఎలాంటి అనుమానాలొద్దని, వాటికీ ఎలాంటి ముప్పులేదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయం ఆనకట్ట(డ్యామ్) పై పగుళ్లుతో ప్రమాదం జరుగుతుందని వార్తలొస్తున్న నేపథ్యంలో నవంబర్ 21, గురువారం నాడు అధికారులతో చర్చించి, నివేదికలు తెప్పించుకున్నారు. ఆనకట్ట భద్రత పై అన్ని చర్యలు తీసుకుంటున్నామని,ఈ విషయంపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలే అని ఆయన చెప్పారు. శ్రీశైలం ఆనకట్టపై ప్రజల్లో అనవసరపు అనుమానాలు, అపోహలు కల్పించవద్దని మంత్రి అనిల్ కుమార్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
మరో వైపు శ్రీశైలం ఆనకట్ట పర్యవేక్షక ఇంజినీరు చంద్రశేఖర్ స్పందిస్తూ, ఆనకట్టకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. శ్రీశైలం జలాశయం సురక్షితంగానే ఉందని సీడబ్ల్యూసీ ఇప్పటికే నిర్ధరించిందని చెప్పారు. అలాగే ప్లంజ్ పూల్ సర్వే నివేదికలు వచ్చిన వెంటనే ఆనకట్ట భద్రత విషయాన్ని కమిటీ ముందు ఉంచుతామని అన్నారు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్, తన గంగాజల్ సాక్షరతా యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, నదులను సందర్శిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా బుధవారం శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన ఆయన అక్కడి ఆనకట్టకు అడ్డుగా పగుళ్లు ఏర్పడి ప్రమాదస్థితిలో ఉందని పేర్కొన్నారు. ఆనకట్ట తెగిపోతే నాగార్జునసాగర్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, తెలుగు రాష్ట్రాలకు ఊహించని నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర సింగ్ వ్యాఖ్యలతో శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై ఒక్కసారిగా దుమారం చెలరేగింది.
[subscribe]