ఉభయ తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ అంశాలలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను తొలగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈమేరకు కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శితోపాటు ఇద్దరు సభ్యులుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుంటారు. ఈ కమిటీ ప్రతి నెల సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది.
ఈ త్రిసభ్య కమిటీకి, కేంద్రం తరపున హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్రం నుంచి రామకృష్ణారావు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎస్.ఎస్.రావత్ మిగిలిన సభ్యులుగా ఉండనున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు వివాదాలపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు. ప్రతి నెలా ఈ త్రిసభ్య కమిటీ సమావేశం అవుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. కాగా, ఈనెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిటీ మొదటి సమావేశం జరుగనుంది.
ఈనేపథ్యంలో.. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ గతంలో ప్రకటనలు చేసిన కేంద్రం, తాజాగా హోంశాఖ ఎజెండాలో ప్రత్యేక హోదా విషయాన్ని చేర్చినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై చర్చించేందుకే త్రి సభ్య కమిటీ అంటూ పేర్కొన్న హోంశాఖ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండాలో చేర్చడం విశేషం. ఈ కమిటీ ముఖ్యంగా.. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు, ఏపీఎస్ఎఫ్సీ విభజన, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి గ్రాంట్స్, రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ సమస్యలు, పన్నుల వ్యవహారంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ